Facebook

Header Ads

పోలవరం ఒక అద్భుతం...ఆ అద్భుత ఆవిష్కరణ ను గురించి తెలుసుకోవాలని ఉందా...అయితే చదవండి మరి. | Brief History of Polavaram


పోలవరం కాలువ భోగోళిక చిత్రం గూగుల్ మప్స్ ద్వారా 
ఎప్పుడు ఉండే రాజకీయాలే...మంచి సమాచారం ఓపిగ్గా చదివి తెలుసుకోండి. ఒక చరిత్ర గురించి తెలుసు కోవాలంటే  ఎంతో ఓపిక వుండాలి. దాని గురించి చదివిన,  విన్న,  ఇంకా ఎన్నో విషయాలు   తెలుసుకోవాలి అనే కుతూహలం కలగడం సహజం.  ఇవాళ నేను మీకు అలంటి ఒక చరిత్ర కలిగిన పోలవరం గురించి  చెప్పడానికి ఇది వ్రాస్తున్నాను. పోలవరం  ఒక అద్భుతం...ఆ అద్భుత ఆవిష్కరణ ను గురించి తెలుసుకోవాలని ఉందా...


భారతదేశం లో గంగా  నది తర్వాత రెండవ పెద్ద నది  గోదావరి. ఇది నాసిక్ లోని త్రయం బకేశ్వరం లో జన్మించి  మహారాష్ట్ర ,తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల గుండా ప్రవహిస్తుంది. భారత దేశం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశం. అందులో ఆంధ్ర ప్రదేశ్ లోని సాగు భూమి  మిగతా రాష్ట్రాల సాగు భూమి శాతం తో పోలిస్తే ఇక్కడ సాగు భూమి శాతం  తక్కువ. కాలువల   ద్వారా నీటి లభ్యత ఉన్న జిల్లాలు అయినా కృష్ణా-గోదావరి డెల్టాల్లో 22లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్గొండ,గుంటూరు, ప్రకాశం జిల్లాల లోని 20 లక్షల ఎకరాలు మాత్రమే సాగు జరుగుతున్నది. గోదావరికి ఎడమవైపునున్న తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని మెట్టప్రాంతాలు, కుడివైపునున్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటివనరు లేదు. 


పోలవరం ప్రాజెక్టుపై 1942లో బ్రిటిష్‌ పాలకులు తొలి ఆలోచన చేశారు. అయ్యంగార్‌ అనే చీఫ్‌ ఇంజనీర్‌ ప్రాజెక్టు కోసం తొలిసారి కృషి చేశారు. అమెరికా నుంచి 'కార్న్‌ టెరిజాగీ' తోపాటు మరికొందరు ఇంజనీరింగ్‌ నిపుణులు గోదావరిపై డ్యామ్‌ను ఎక్కడ కట్టాలో పరిశీలించారు. ఇప్పుడున్న డ్యామ్‌ సైట్‌ నుంచి వందమీటర్ల దిగువన నిర్మాణానికి అనుకూలంగా ఉందని సూచించారు. అవన్నీ ఆలోచనల దశలోనే ఆగిపోయాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ... ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఈ ప్రాజెక్టును చేపట్టలేకపోయారు. 

నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాతప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కొనసాగిస్తోంది. నిర్మాణం, డిజైన్‌లో అనేక ప్రత్యేకతలు.. ప్రవాహానికి అడ్డుగా మట్టి, రాతి కట్ట మరోవైపున ప్రాజెక్టు స్పిల్‌ వే.. దేశంలోనే తొలి... భారీ డయాఫ్రం వాల్‌ 80 అడుగుల నుంచి స్పిల్‌వే కాంక్రీట్‌.. భౌగోళిక సమస్యలకు కొత్త పరిష్కారం.


నిర్మాణం, డిజైన్‌లో అనేక ప్రత్యేకతలు దాగి ఉన్నాయి  మన పోలవరం ప్రాజెక్ లో  

నాడు నింగి నుంచి గంగను భువికి తెప్పించేందుకు భగీరథుడు తపస్సు చేశాడు. పట్టువదలకుండా ప్రయత్నించి, దేవదేవులనే ఒప్పించి అనుకున్నది సాధించాడు! పుడమిని పునీతం చేశాడు! నేడు అదే ప్రయత్నం చేస్తున్నారు.అక్కడ మహా యజ్ఞం జరుగుతోంది! నీటిని నిలిపేందుకు కొండలు బద్దలవుతున్నాయి! పుడమికి పచ్చటి హారతి పట్టేందుకు దారులు సిద్ధమవుతున్నాయి! కోరలు తొడిగిన యంత్రాలు విరామమెరుగకుండా శ్రమిస్తున్నాయి! రేపటి వెలుగుల కోసం అక్కడ వేలాది మంది స్వేదం చిందుతోంది! దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో ఇంజనీరింగ్‌ అద్భుతం జరుగుతోంది!

నవ్యాంధ్రకు జల-జీవ నాడి!

రాష్ట్రంలోని అన్ని పరివాహక ప్రాంతాలను తడిపేంత స్థాయి!  వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా... కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి ఇది తెర దించుతుంది.ఆ చివర అనంతపురం నుంచి పైనున్న శ్రీకాకుళం దాకా దాదాపు అన్ని నదీ బేసిన్లకు అదనపు ప్రయోజనం కలిగించే బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది.


ఏ ప్రాజెక్టుదైనా ఒకటే శైలి. నది ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట కడతారు. నీటిని నిలుపుతారు. అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు వైపులా రాయి లేదా మట్టితో కట్ట పోస్తారు. నాగార్జున సాగర్‌ నిర్మాణం ఇలాంటిదే.  శ్రీశైలం ప్రాజెక్టుకు ఇలా కట్టలు పోయాల్సిన అవసరం రాలేదు. ప్రధాన ప్రవాహంపై రెండు కొండల మధ్య ఆనకట్ట కట్టారు. కానీ...పోలవరం నిర్మాణ శైలే ప్రత్యేకం. గేట్లతో కూడిన ప్రధానమైన ఆనకట్ట (స్పిల్‌వే)ను నది ప్రవాహంపై కాకుండా పక్కన నిర్మిస్తున్నారు. నది ప్రవాహంపై రాళ్లు, మట్టి, కాంక్రీట్‌తో కూడిన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌) నిర్మితమవుతుంది. నదీ ప్రవాహాన్ని ఇదే అడ్డుకుంటుంది. అక్కడ నిండే నీరు చుట్టూ విస్తరించి, నిలుస్తుంది. పక్కనే ఉన్న స్పిల్‌వేనూ తాకుతుంది.నీటి విడుదల అక్కడి నుంచే జరుగుతుంది. అక్కడ విడుదలైన నీరు కిలోమీటరు పాటు ప్రవహించి అసలైన ప్రవాహంలో కలుస్తుంది. అంటే... ఇక్కడ నదీ ప్రవాహాన్నే మారుస్తున్నారన్న మాట! 



ప్రవాహంపై రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కట్టడం ఎందుకు?

గోదావరి లోతుకు వెళ్లేకొద్దీ ఇసుకే! ప్రవాహ ప్రాంతంలో గరిష్ఠంగా 150 మీటర్లు ఇసుకే ఉంది. ఇక్కడ స్పిల్‌వే నిర్మించాలంటే రాయి వచ్చేదాకా వెళ్లి అక్కడి నుంచి కాంక్రీటు నిర్మాణం మొదలుపెట్టాలి. ఇది అసాధ్యం! అందుకే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.


భూగర్భంలో ఇసుక ఉన్న చోట ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మించి స్పిల్‌వేను పక్కకు మార్చారు.

ప్రవాహానికి అడ్డుగా ‘కొండ’

ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌...ఇది నదీ ప్రవాహానికి అడ్డంగా 1750 మీటర్ల పొడవు, 41 మీటర్లు ఎత్తు ఉంటుంది. కింది భాగంలో 300 మీటర్ల వెడల్పులో నిర్మిస్తారు. పైన 30 మీటర్లు ఉంటుంది. అంటే... నదీ ప్రవాహానికి 1.75 కిలోమీటర్ల పొడవున ఒక కొండనే అడ్డు వేస్తారన్న మాట. ఈ అడ్డుకట్టే నీటిని నిలిపి ఉంచుతుంది. ఇది గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఉంటుంది. గోదావరిపై ఇప్పటిదాకా వచ్చిన గరిష్ఠ వరద 30 లక్షల క్యూసెక్కుల లోపే! 


వేగానికి నిదర్శనం...



చైనాలోని త్రిగోర్జియస్ గరిష్ఠంగా రోజుకు 7000వేల క్యూబిక్‌ మీటర్ల పని జరిగింది. పోలవరం ప్రాజెక్టులో రోజుకు 10వేల క్యూబిక్‌ మీటర్ల పని జరగనుంది. హెడ్‌ వర్క్స్‌లో మొత్తం 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని జరగాల్సి ఉంది. ఇప్పటికి 717 లక్షల క్యూబిక్‌ మీటర్లు, అంటే 68 శాతం పని పూర్తయింది. గంటకు 250 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ కలిపే బ్యాచింగ్‌ ప్లాంట్‌లు మూడు ఉన్నాయి. ప్రాజెక్టులో వినియోగిస్తున్న మొత్తం పరికరాల విలువ రూ.2వేల కోట్లు. ఈ ఖర్చుతో మధ్య తరహా ప్రాజెక్టునే నిర్మించవచ్చు. ప్రాజెక్టులో గంటకు 1750 టన్నుల క్యూబిక్‌ మీటర్ల కంకర కొట్టే యంత్రాలున్నాయి. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారు. 

ఏ నిర్మాణ ప్రాజెక్టుకైనా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవు. అయితే, పోలవరం పనులు మాత్రం ఎండకాసినా, వాన కురిసినా ఆగవు. వర్షాకాలంలో స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో చేరే నీటిని తోడి, నదిలో కలిపేందుకు 350 హెచ్‌పీ మోటర్లను ఉపయోగిస్తున్నారు. గట్టున ఉండే 200 మీటర్ల వరకు కాంక్రీట్‌ను తీసుకెళ్లి వేయగల ‘ఫుడ్జ్‌ మిస్టర్‌’ టెలీబెల్ట్‌ యంత్రాన్ని ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే 130 మీటర్ల దూరం వరకు కాంక్రీట్‌ను వేయగల యంత్రాలూ ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో 3, 4 వేల మంది పని చేస్తున్నారు. ఒక దశలో ఇది 10వేల మందికి చేరుతోంది. అంటే... ఒక మోస్తరు ఊరే ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమవుతుందన్న మాట!

కాఫర్‌ డ్యామ్‌:

 పోలవరం నిర్మాణంలో మరో ప్రత్యేకత కాఫర్‌ డ్యామ్‌. రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరిగేందుకు నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించేందుకు తాత్కాలికంగా కాఫర్‌ డ్యామ్‌ను నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాదికి కాఫర్‌ డ్యామ్‌ ద్వారానే నీటిని మళ్లించి.. గ్రావిటీ ద్వారా కుడి కాలువకు నీరు అందించాలనే యోచన. ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ కిందివైపున కూడా మరో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాల్సి వస్తోంది.

కూల్‌ కూల్‌:::

ఒక చిన్న ఇంటికి స్లాబ్‌ వేస్తే 20 రోజులు క్యూరింగ్‌ చేయాలి. రసాయన చర్య ఫలితంగా కాంక్రీట్‌ నుంచి ఉష్ణోగ్రత వెలువడి, చీలికలు/పగుళ్లు/బీటలు  రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి... లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంకీట్ర్‌ పని జరిగే పోలవరంలాంటి ప్రాజెక్టుల మాటేమిటి? ప్రతి 3మీటర్ల కాంక్రీట్‌కు అన్నేసి రోజులు క్యూరింగ్‌ చేసుకుంటూ వెళితే... ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు? అందుకే... ప్రత్యేకమైన ‘కూలింగ్‌ టెక్నాలజీ’ ఉపయోగిస్తున్నారు. 

పర్యాటకానికి మరింత ప్రభ:

పాపి కొండలు పర్యాటక ప్రాంతం 
పోలవరం నిర్మాణం తర్వాత పాపి కొండలు  మునిగిపోతాయన్నది  అపోహ  మాత్రమే! పోలవరం ప్రాజెక్టుకు దిగువన 40 కి.మీ. దూరాన రాజమండ్రి ఉంది. ఆరు కి.మీ. ఎగువన పాపికొండలు ఉన్నాయి. పాపికొండల ఎత్తు సముద్ర మట్టం నుంచి 240 మీటర్లు. పోలవరంలో పూర్తి నిల్వ స్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 40 మీటర్లు మాత్రమే! పోలవరం నిర్మించినా పాపికొండల విహార యాత్ర ఆగదు. అంతేకాదు, పోలవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకుల పడవలు డ్యామ్‌ను అటూ ఇటూ దాటేందుకు ‘పనామా కాల్వ’ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. స్పిల్‌వే నుంచి జారి పడే గోదావరి జలాల అందాలను చూసేందుకు వీలుగా దేశంలోనే అతి పెద్ద సస్పెన్షన్‌ కేబుల్‌ (ఐకానిన్‌) బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు.

చేపల కోసం ప్రత్యేక దారి:


గోదావరి లో దొరికే పులస చేప 
గోదావరి నదికి అడ్డుకట్ట వేసేస్తే గోదావరిలో ప్రత్యేకంగా లభించే ‘పులస’ వంటి మత్స్య సంపద ఏమైపోవాలి?ఇలాంటి అనుమానాలు సహజం.మత్స్య సంపదకు ఏ మాత్రం నష్టం జరగకుండా.. చేపలు, ఇతర జల చరాల కోసం ప్రత్యేక మార్గాన్నీ పోలవరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ‘ఫిష్‌ లేడర్‌’ అంటారు. దీని డిజైన్‌ను కేంద్ర జల వనరుల సంఘం రూపొందించింది. ఈ నిర్మాణం లేకుంటే అటవీ, పర్యావరణ శాఖ అసలు ప్రాజెక్టు నిర్మాణానికే అనుమతి ఇవ్వదు.

‘పవర్‌’ఫుల్‌ హౌస్‌: 

పోలవరం ప్రాజెక్టులో భాగంగా 969 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దీని నిర్మాణ బాధ్యత 'జెన్‌కో'కు ప్రభుత్వం అప్పగించింది.

రాళ్లు, మట్టి పోస్తే సరిపోదు::!

మట్టి, రాళ్లు, కాంక్రీటును కుప్పగా వేసేస్తే.. కింది నుంచి ఇసుక జారి పోతుంది. పైనున్న కట్ట కుంగిపోతుంది. అది జరగకుండా ఉండాలంటే రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ దిగువ నుంచి చుక్క నీరు అటువైపు వెళ్లకూడదు. పైనే కాదు, భూగర్భంలోనూ నీటి ప్రవాహాన్ని నిలిపి వేయాలి. దీనికోసం పైనుంచి భూగర్భంలో రాయి వచ్చేదాకా లోపలికి వెళ్లి ఒక కాంక్రీట్‌ గోడ కట్టాలి. అదే 'డయాఫ్రం:వాల్‌. ప్రాజెక్టులో స్పిల్‌వే ఎంతకీలకమో డయాఫ్రంవాల్‌ అంతే కీలకం!చకచకా గేట్లు..సహజంగా కాంక్రీట్‌ పని మొత్తం పూర్తయ్యాక రేడియల్‌ గేట్ల తయారీ మొదలుపెడతారు. కానీ... ప్రాజెక్టు పూర్తిపై నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటి నుంచే గేట్ల తయారీ మొదలుపెట్టింది. ఒక్కో గేటు పొడవు 20 మీటర్లు. వెడల్పు 15 మీటర్లు. మొత్తం 48 గేట్లలో 26 ఇప్పటికే సిద్ధమయ్యాయి. స్కిన్‌ప్లేట్‌తో కలిపి ఒక్కో గేటు బరువు 90 టన్నులు. ఇతరత్రా సపోర్ట్స్‌తో కలిపి, వీటిని స్పిల్‌వేకు బరువు 325 టన్నులకు చేరుతుంది.గేట్లను ఆపరేట్‌ చేసేందుకు ‘హైడ్రాలిక్‌’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తారు.


జర్మనీ యంత్రంతో ‘డయాఫ్రం’


పోలవరం డయాఫ్రం నిర్మాణం లో వాడిన భారీ యంత్రం 
మనదేశంలో ఇప్పటిదాకా ఎక్కడా, ఏ ప్రాజెక్టుకూ బాగా లోతుగా వెళ్లి డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిన అవసరం రాలేదు. ఈ పని చేయడంలో జర్మనీకి చెందిన ‘బావర్‌’ దిట్ట.అందుకే... ‘ఎల్‌అండ్‌టీ-బావర్‌’కు డయాఫ్రం వాల్‌ నిర్మాణం పని అప్పగించారు. ఇందుకు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. కోరల చక్రాలున్న ఈ యంత్రం ఇసుకను తోస్తూ, భూమిని కోస్తూ లోపలికి దూసుకెళ్తుంది. అలా రాయి వచ్చేదాకా వెళ్తుంది. రాతిని కూడా రెండు మీటర్లపాటు కోసి... అక్కడి నుంచి కాంక్రీట్‌ వేస్తూ వెళుతుంది. ఈ సమయంలో వచ్చే ఇసుక, మట్టి, చిన్నచిన్న రాళ్లను పైపుల ద్వారం దూరంగా వేసేస్తుంది. ఇదంతా ఏకకాలంలో జరుగుతుంది. వెరసి... ఈ భారీ యంత్రం భూగర్భంలోనే ఐదు అడుగుల వెడల్పుతో భారీ కాంక్రీటు గోడను కడుతుంది.భూగర్భంలో డయాఫ్రం వాల్‌! ఎగువన... ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌! ఇక... ఒక్క చుక్క కూడా ఇటు నుంచి అటు వైపునకు ఇంకదు, వెళ్లదు! అడ్డుకట్ట భద్రంగా ఉంటుంది.

పోలవరం లో మరో నూతన అధ్యాయం మహా స్పిల్‌ వే..


స్పిల్ వే గేట్లు కోసం సిద్దంచేసిన చానెల్స్ మరియు యంత్రాలు 

  
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పొడవు 1150 మీటర్లు. దీని నిర్మాణం ఒక మహా యజ్ఞం. భూమి పై నుంచి గట్టి రాయి వచ్చేదాకా తవ్వి, ఆ రాయినీ మరింత తొలిచి... అక్కడి నుంచి కాంక్రీట్‌ వేసుకుంటూ వస్తారు. ప్రాజెక్టుకు ఒకవైపున తక్కువ లోతులోనే రాయి వచ్చింది. కుడివైపున మాత్రం 80 అడుగులు కిందికి వెళ్లాల్సి వచ్చింది. అంటే... దిగువకు ఎనిమిది అంతస్తులు తవ్వి, అక్కడి నుంచి కాంక్రీట్‌ పని చేస్తూ వస్తున్నారు. మరింత కింద కూడా రాళ్ల మధ్య ఎలాంటి ‘గ్యాప్స్‌’ ఉన్నా పూడ్చేందుకు... రంధ్రాలు వేసి ‘జెట్‌ గ్రౌటింగ్‌’ ద్వారా సిమెంటు పంపిస్తున్నారు. ఇసుకను మజ్జిగ కవ్వంలా చిలికినట్లు పక్కకు నెట్టేసి... సిమెంటును పంపే ‘ఇంపెరియస్‌ జెట్‌ గ్రౌటింగ్‌’ కూడా చేస్తున్నారు. ఈ గ్రౌటింగ్‌ రంధ్రాలను ప్రతి ఆరు మీటర్లకు ఒకటి చొప్పున వేస్తున్నారు. జర్మనీకి చెందిన 'కెల్లెర్‌' సంస్థ ఈ పని చేస్తోంది. స్పిల్‌వేపై మొత్తం 48 గేట్లు ఉంటాయి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం పనులు ఒకేసారి జరుగుతున్నాయి.


పోలవరం నిర్మాణం సాకారం చేసేందుకు జరుగుతున్న కృషిలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. 



పోలవరం కాలువ నిర్మాణం లో పలు పంచుకుంటున్న కార్మికుల్లో కొంత మంది 

దీనిని అదృష్టంగా భావిస్తున్నాం.ప్రాజెక్టు నిర్మాణ పనులను వేటికవిగా విభజించి. ప్రతి పనికీ లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం.ఈ ప్రాజెక్టు పనుల భారీతనం, ప్రత్యేకత కారణంగా యంత్ర పరికరాలను జర్మనీ నుంచి రప్పిస్తఅంతర్జాతీయంగా అనుభవం కలిగిన సంస్థలు ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రానికి దశాదిశా చూపే ప్రాజెక్టు ఇది. పోలవరం పూర్తయితే రాష్ట్రంలోని రైతుల సాగు నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి.


పోలవరం ప్రత్యేకతలు... 

గరిష్ట నీటి మట్టము: + 45.72 మీటర్లు (+ 150.00 డుగులు)

క్రెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిల్ వే : + 25.72 మీటర్లు (+84.39 డుగులు)

ఈసీఆర్ఎఫ్ డ్యాం టాప్ బండ్ లెవెల్ : + 54.00 మీటర్లు (+177.16 అడుగులు)

గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వాయర్ :  194.60 టీఎంసి

లైవ్ స్టోరేజ్ : 75.20 టీఎంసి

ప్రాబబుల్మ్యాగ్జిమమ్ ఫ్లడ్ డిశ్చార్జ్: 50 లక్షలక్యూసెక్కులు

క్యాచ్ మెంట్ ఏరియా : 3,06,643 చ.కి.మీ

సబ్ మెర్జెన్స్ ఏరియా : 601 చ.కి.మీ

పోలవరంతో లాభాలు:

 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి,గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీటి మళ్లింపు. 2.91 లక్షల హెక్టార్లు (7.2 లక్షల హెక్టార్లు)కు సాగునీరు అందించొచ్చు.విశాఖ నగరవాసుల తాగునీటి కోసం 23.44 టీఎంసీల కేటాయింపు.540 గ్రామాలు (28.5 లక్షల మంది ప్రజలకు) తాగునీటి సౌకర్యం, చేపల పెంపకం, పడవలతో రవాణా మార్గానికి అవకాశాలుఒడీషా, చత్తీస్ ఘడ్ లకు 5 టీఎంసీలు, 1.5 టీఎంసీల నీటి సరఫరా.

కుడి కాలువ : 174 కిలోమీటర్ పొడవైన ఈ కాలువ ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇదే కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తారు.

ఎడమ కాలువ : 181.5 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు.

పోలవరానికి 2014 అంచనాల ప్రకారం 58139 కోట్లు ఎందుకు??

222 మండలాలు, 371 జనావాసాలు,ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాల సంఖ్య 98818 ,2,00,000 పైగా నిర్వాసితులు,వేల ఇండ్లు, లక్షల ఎకరాలు.. నాడు ఎకరానికి 1,50,000, ఇంటికి 1,00,000 చొప్పున మొత్తం 2,000 కోట్లు ప్రకటించిి 5,000 కోట్లతో మురుగు కాలువలు తవ్వితే... నేడు ఎకరానికి 10,65,000, ఇంటికి 6,75,000 వేలు, వారి పునరావాసపు వసతి, మౌళిక సదుపాయాల కోసం  3000 కోట్ల చొప్పున మొత్తం 33,858 కోట్లు.. కాలువల బాగుకు, ఆర్దిక సర్దుబాట్లకు, ప్రపంచ ప్రసిద్ది చెందిన ఇంజినీరింగ్‌ వర్క్స్ కి మొత్తం ప్రాజెక్టు  రూ.24,461 కోట్లు...


ఆంధ్రుల జీవ నాడి  అయిన పోలవరం త్వరలోనే పూర్తి కావాలని, ఆంధ్ర రాష్ట్రము ఇంకా సశ్య శ్యామలం కావలని అందరం కోరుకుందాం 


ఇది అండి మన కలల పోలవరం వివరాలు...ఇదీ ఒక చరిత్ర... అందరికి తెలియజేయండి మరియు షేర్ చేయండి.ఎన్నో ప్రభత్వాలు వచ్చాయి, పోయాయి, కాని ఇప్పడు ఉన్న ప్రభుత్వం కేంద్రం తో పోరాడి జాతీయ హోదాని తీసుకోని వచ్చింది కేంద్రం నిధులు ఇవ్వక పోయిన  ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రత్యేక శ్రద్ధ తో, ప్రతి పనిని ఒక నిర్దిష్ట ప్రణాళికతో పూర్తి చేసుకుంటూ వస్తోంది మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.  





Post a Comment

0 Comments